ఏపీ బడ్జెట్ రూపకల్పనలో యనమల బిజీ బిజీ!
posted on Jul 16, 2014 12:26PM
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి మంత్రి యనమల బడ్జెట్ ప్రతిపాదనలపై కసరత్తు ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే బడ్జెట్ సమీక్షల్లో భాగంగా పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మార్కెటింగ్, గిడ్డంగులు, పశుసంవర్ధక, మత్స్య, పౌరసరఫరాలు, సహకార శాఖలపై ఉన్నతాధికారులతో సమావేశమై ప్రతిపాదనలను స్వీకరించారు. మరోసారి కూడా అధికారులతో సమావేశం కానున్నారు. అలాగే వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన యనమల వారికి కొన్ని సూచనలు చేశారు. బడ్జెట్లో సాగుకు, వ్యవసాయ అనుబంధ రంగాలకూ నిధులు తగిన రీతిలో కేటాయిస్తామని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో మెరుగైన ఫలితాలు రావాలని, అందుకు తగిన ప్రతిపాదనలు చేయాలని మంత్రి యనమల చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, వారికి మంచి సదుపాయాలు అందేలా సూచనలివ్వాలని కోరారు. పాఠశాలలు, కాలేజీల్లో మౌలికసదుపాయాలకోసం, నాణ్యమైన విద్య కోసం..పథకాలు తయారుచేసి పంపాలన్నారు.