కాజా పొలాల్లో బయల్పడిన పురాతన గణేశ విగ్రహాలు.!
Published on: Thu Jul 23, 2026 8:16PM

గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, కాజా గ్రామ పొలాల్లో 1600 సంవత్సరాల నాటి రెండు చిన్న గణేశ విగ్రహాలు వెలుగు చూశాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. కాజా గ్రామానికి చెందిన పెద్దకాపు సింహాద్రి వెంకటరామారెడ్డి పొలాల్లోని పాటి దిబ్బనుగురువారం (జులై 23) దున్నతుండగా రెండు చిన్న విగ్రహాలు నాగలి చాలు పైకి వచ్చాయన్న సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆ విగ్రహాలను పరిశీలించారు.

నాగలి సాలు నుంచి బయటపడిన ఎర్రఇసుక రాతి (చింతామణి రాయి) గణేష్ విగ్రహాలతో పాటు ఎరుపు, నలుపు, నలుపు, ఎరుపు, గచ్చకాయ, గోధుమ రంగు మట్టి పాత్రల పెంకులు కూడా దొరికాయని, అవి 1-4వ శతాబ్దాల (శాతవాహన, ఆనందగోత్రినుల కాలం) నాటివని శివనాగిరెడ్డి చెప్పారు.
సింహాద్రి వెంకటరామారెడ్డి భద్రపరిచిన రెండు శిల్పాల్లోని గణేషుడు రెండు చేతులతో, దంతం, మోదకాలను ధరించి, తల పై కిరీటం లేకుండా సహజసిద్ధమైన ఏనుగు తల, తొండం, పెద్ద బోజ్జతో లలితాసనంలో కూర్చుని ఉన్నాడని తెలిపారు.
పల్నాడు జిల్లా చేజర్ల కపోతేశ్వర ఆలయంలో ఉన్న పాలరాతి గణేశ విగ్రహాన్ని పోలి ఉనందున, ప్రతిమా లక్షణాన్ని బట్టి ఈ రెండు గణేశ ప్రతిమలు, సా.శ. 4వ శతాబ్దిలో ఆంధ్రదేశాన్ని పాలించిన ఆనందగోత్రిన రాజుల కాలం నాటివని, చారిత్రక ప్రాధాన్యత గల ఈ విగ్రహాలను కాపాడుకోవాలని శివనాగిరెడ్డి గ్రామానికి చెందిన వెంకటరామారెడ్డికి విజ్ఞప్తి చేశారు.
Ancient Ganesha idols unearthed in Kaja fields, Pleach India Goundation, Siva nagireddy, Kaja Villege


