అనంతపురం జిల్లాలో ఉప ఎన్నికల సందడి!
Published on: Mon Apr 9, 2012 7:04AM
అనంతపురం జిల్లాలో అప్పుడే ఉప ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఈ జిల్లాలో అనంతపురం అర్బన్, రాయదుర్గం స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలు గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందినవే. తమ స్థానాలను తాము దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు, సీమప్రాంతంలో తనకు ఎదురులేదని చెప్పడం కోసం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రారంభంనుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వున్న అనంతపురం జిల్లాలో మరల తనపట్టు సంపాదించుకోవాలనే లక్ష్యం తెలుగుదేశంపార్టీకి వుంది.
అయితే వాస్తవానికి ఈ మూడు పార్టీలలో నాయకత్వలోపం వుంది. మూడు పార్టీలు ధీటైన అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించాయి. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన జేసి దివాకర్ రెడ్డి సోదరులు అసంతృప్తితో వున్నారు. వై ఎస్ ఆర్ పార్టీలో ఎంతో ఉత్సాహం ప్రవేశించిన కాపు రామచంద్రారెడ్డి వంటి నేతలలో నేడు ఉత్సాహం కొరవడడం వంటి కారణాలు తెలుగుదేశంపార్టీ కి లాభించే అవకాశం వున్నట్టు ప్రాథమిక సమాచారం. జిల్లాలో జరిగే రెండు స్థానాలలో కనీసం ఒక స్థానంలో తెలుగుదేశంపార్టీ విజయం సాధించడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. జేసి ప్రభాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి తెలుగుదేశంపార్టీ తరపున రాయదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు.


