TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జెసి దివాకర్ - పయ్యాపుల 'మద్యం' బంధం

Published on: Wed May 2, 2012 9:38AM

వారిద్దరూ వేరు వేరు రాజకీయపార్టీల్లో ఉన్నారు. ఒకపార్టీ అంటే మరోపార్టీకి ఏమాత్రం గిట్టదు. ఈ పార్టీల గోల మనకెందుకు అనుకున్న ఈ ఇద్దరు కలిసి అనంతపురంజిల్లా మద్యం వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ పార్టీలను పక్కనపెట్టి మద్యం వ్యాపారం చేస్తున్న ఇద్దరూ మరెవరో కాదు ఒకరు మాజీ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే అయిన జెసి దివాకర్ రెడ్డి కాగా, మరొకరు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యాపుల కేశవ్. వీరిద్దరూ ఎంతో గుట్టుగా చాలాకాలం నుంచి ఈ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిసింది.

 

వీరిద్దరి తరపునా వారి సోదరులు ఈ వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నారు. రాష్ట్రమంతటా మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ దాడులు చేసినప్పటికీ వీరిద్దరి సిండికేట్ ను తాకడానికి ఆ శాఖ అధికారులు సాహసించలేకపోయారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే జెసి దివాకర్ రెడ్డికి అత్యంత సన్నిహిత బంధువు అయిన దీపక్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ రాయదుర్గం అసెంబ్లీ టిక్కెట్టును కట్టబెట్టడం. ఈ అంశంలో కూడా ఈ ఇద్దరు నాయకులు సమన్వయంతో పనిచేసినట్లు తెలిసింది. దీపక్ రెడ్డికి టిడిపి టిక్కెట్ ఇప్పించేందుకు పయ్యాపుల కేశవ్ బాలకృష్ణపై వత్తిడి తెచ్చాడని, బాలకృష్ణ చంద్రబాబుపై వత్తిడి తెచ్చాడని తెలిసింది. దీపక్ రెడ్డి మైనింగ్ వ్యాపారి. ఆయనపై ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ పయ్యాపుల కేశవ్ చొరవ తీసుకుని దీపక్ రెడ్డికి తెలుగుదేశంపార్టీ టిక్కెట్ వచ్చేలా చేశారని తెలిసింది.