పసికందు మృతి ఘటనపై విచారణకు మంత్రి సంధ్యారాణి ఆదేశం
Published on: Sun Oct 5, 2025 12:10PM

అనంతపురం ఐసీడీఎస్ శిశుగృహంలో పసికందు మృతి ఘటనపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. శిశుగృహ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయిందని వస్తున్న ఆరోపణలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిబ్బంది మధ్య అంతర్గత విభేదాల వల్ల బిడ్డకు సమయానికి పాలు ఇవ్వలేదనే సమాచారం వస్తోందని, అది నిజమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక అధికారులు మాత్రం బిడ్డ మృతికి అనారోగ్యమే కారణమని చెబుతున్నారు. ఈ వివాదంపై మంత్రి సంధ్యారాణి ఐసీడీఎస్ ఉన్నతాధికారులను సమగ్రంగా విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


