మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఆనందీబెన్ పటేల్...

 


మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఆనందీబెన్ పటేల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు అందాయి. ఆనందీబెన్ పటేల్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించారని, ఈ రోజు నుంచే ఆమె గవర్నర్‌గా కొనసాగుతారని రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది. 2014లో నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక.. ఆయన స్థానంలో ఆనందీబెన్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు, 2016 వరకు గుజరాత్ సీఎంగా పనిచేసిన ఆమె..  పటీదార్‌ రిజర్వేషన్ల ఆందోళన, ప్రభుత్వ వ్యతిరేకత తదితర కారణాల వల్ల ఆమె రెండేళ్లకు మించి సీఎం పదవిలో ఉండలేకపోయారు. ఆమె దిగిపోవడంతో గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌ రుపానీ ఆ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ గెలవడంతో మరోసారి కూడా విజయ్‌ రుపానీ సీఎం బాధ్యతలు చేపట్టారు.

 

కాగా ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ గా ఓం ప్రకాశ్‌ కోహ్లి వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ పదవీకాలం ముగియడంతో ఓం ప్రకాశ్‌ కోహ్లి అటు గుజరాత్ తో పాటు మధ్యప్రదేశ్ గవర్నర్‌ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఆనందిబేన్‌ బాధ్యతలు చేపడితే.. గుజరాత్‌ పూర్తిస్థాయి గవర్నర్‌గా కోహ్లి కొనసాగుతారు.