అందుకే పార్టీ చేరిక.. పదవులు ఆశించి కాదు.. ఆనం బ్రదర్స్

తమ పార్టీ నుండి వేరే పార్టీలోకి మారే ప్రతి నాయకుడు .. తాము ప్రజలకు సేవ చేయాలనే పార్టీ మారుతున్నామని.. పదవులు ఆశించిన కాదని చెప్పే మాటలు ఇవే. ఇప్పుడు ఆనం బ్రదర్స్ కూడా అందరూ చెప్పే రొటీన్ డైలాగ్సే కొట్టి బోర్ కొట్టించారు. ఈ సోదరులు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి మారుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆనం రాంనారాయణరెడ్డి తమ నియోజక వర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కూడా జరిపారు. తమ పార్టీ చేరికను రెండు రోజుల్లో ప్రకటిస్తామని కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాము ప్రజాసేవ చేయకుండా ఉండలేక పోతున్నామని, అందుకే టీడీపీలోకి చేరబోతున్నామని.. అంతేకానీ, పదవీ వ్యామోహంతో కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరడం లేదని వారు చెపుతున్నారు. అంతేకాదు పదవుల కోసం రాజకీయాలు చేయకూడదని, బిడ్డల భవిష్యత్ కోసం రాజకీయాలు చేయాలని ఆనం సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబుకు అండగా నిలవాలన్నదే తమ అభిమతమన్నారు. మరి పదవులు ఆశించకపోతే.. కాంగ్రెస్ లో ఉండైనా ప్రజాసేవ చేయోచ్చని ఆనం బ్రదర్స్ కి తెలియదా.