జ'గన్' పేలితే కాంగ్రెస్ కుప్పకూలడం ఖాయం!
Published on: Sat May 5, 2012 12:25PM
ఉప ఎన్నికలతో రాష్ట్రంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేత జగన్ భవితవ్యంతో పాటు 2014 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా వుంటాయో తేలిపోతుందని పరిశీలకులు భావిస్తున్నారు. నేతలు ఎవరికివారే ఉప ఎన్నికలు రిఫరెండమ్ కాదని చెబుతున్నప్పటికీ సాధారణ ఎన్నికలకు కేవలం రెండు సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉండటం వల్ల రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో పార్టీల బలాబలాలు కూడా బహిర్గతం అవుతాయని భావిస్తున్నారు.
నిజానికి ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలకు చెందిన పోటీగా మాత్రమే భావించాల్సి వుంటుంది. ఎందుకంటే ఉప ఎన్నికలు జరుగుతున్న 18 అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీకి చెందినవే. చిరంజీవి రాజీనామా చేసిన తిరుపతి స్థానం మినహాయిస్తే మిగిలిన 17 స్థానాలకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు కాంగ్రెస్ నుంచి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించినవారే. ఈ ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తే అజ్గాన్ అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు ఆమోదిస్తున్నారనుకోవాల్సి వస్తుంది.
ఇదే జరిగితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కుప్ప కూలడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జగన్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిస్తే కాంగ్రెస్ నుంచి ఆ పార్టీలోని వలసలు ప్రారంభమవు తాయని ఇదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కుప్ప కూలడం ఖాయమని వారు భావిస్తున్నారు. ఒకవేళ మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తే వై.ఎస్.జగన్ ను, ఆయన పార్టీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని భావించవచ్చు. ఈ రెండు పార్టీల మధ్య తెలుగుదేశంపార్టీ విజయం సాధించే పక్షంలో కాంగ్రెస్ ఓటింగ్ చీలడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు లాభం చేకూరుతుందో అవగాహనకు వస్తుంది.


