అల్ ఖైదా చీఫ్ ను ఖతం చేశాం: జోబైడన్
Published on: Tue Aug 2, 2022 10:39AM
అల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా సేనలు మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ధృవీకరించారు. ఆప్ఘన్ రాజధాని కాబూల్ లో డ్రోన్ దాడి నిర్వహించి అల్ జవహరిని ఖతం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికాకు హాని తలపెట్టిన వారు ఎవరైనా ఎంతటి వారైనా ఎక్కడ దాగున్నా వదిలే ప్రశక్తే లేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు.
ఎంతకాలమైనా సరే వెంటాడి, వేటాడి మరీ మట్టుపెడతామని స్పష్టం చేశారు. కాబూల్ లో సీఐఏ జరిపిన డ్రోన్ దాడిలో అల్ జవహరి హతమైనట్లు బైడెన్ ధృవీకరించారు. 9\11 (సెప్టెంబర్ 11 2001)లో అమెరికా ట్విన్ టవర్స్ పై అల్ ఖైదా జరిపిన దాడిలో వేల మంది మరణించిన సంగతి విదితమే.
ఆ దాడుల సూత్రధాని ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా ఖతం చేసిన సంగతి విదితమే. ఇప్పుడు నాటి దాడులలో మరో సూత్రధారి అల్జవహరినీ అగ్రరాజ్యంమట్టుబెట్టింది. ఇలా ఉండగా తమ భూభాగంలో అమెరికా డ్రోన్ దాడి జరిపి జవహరిని హతమార్చడాన్ని తాలిబన్ ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. అమెరికా చర్య అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.


