TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జమిలి ఎన్నికలు.. అంబటి దింపుడు కళ్లెం ఆశ!

Published on: Tue Mar 4, 2025 2:11PM

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పొలిటికల్ జర్నీ దయనీయంగా మారిపోయింది. ప్రజా సమస్యలపై ఆ పార్టీ పోరాటాలకు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. వచ్చినా జనం నమ్ముతారన్న నమ్మకం ఆ పార్టీ నేతలు, శ్రేణులకే లేదు. లేని, రాని హోదా కోసం పట్టుబడుతూ అసెంబ్లీని బహిష్కరించేశారు. దీంతో వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలంతా రాసుకొచ్చిన స్క్రిప్ట్ ను మీడియా సమావేశాలలో చదవడానికే పరిమితమైపోయారు. ఇక అంబటి వంటి మాజీ మంత్రులు అడపాదడపా మీడియా ముందుకు వచ్చి చేస్తున్న విమర్శలు పట్టించుకునే వారే లేని పరిస్థితి ఉంది. 

అసలు గత ఎన్నికలలో ఓటమి తరువాత నుంచీ ఆ పార్టీ ఓటమికి కారణం ప్రజాగ్రహం కాదని చెప్పుకుని సంతృప్తి పడటానికే ప్రాధాన్యత ఇచ్చింది. తమకు 40 శాతం ఓట్లు పడ్డాయనీ, తమ ఓటమికి ఈవీఎం ట్యాంపరింగే కరణమనీ తొలి రోజుల్లో చెప్పుకుంది. అయితే ఈవీఎం టాంపరింగ్ గురించి జగన్ అండ్ కో మాట్లడటంపై జనం నవ్వి పోయారు. దీంతో ఇప్పుడు ఆ పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్ మాట ఎత్తడం లేదు. ఇప్పుడో కొత్త రాగం అందుకుంది. మూడేళ్లలో జమిలి ఎన్నికలు రానున్నాయి, ఆ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పుకుంటోంది. తాజాగా వెలువడిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో పోటీకి జగన్ పార్టీ దూరంగా ఉన్నప్పటికీ, ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులను జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అయినా వైసీపీయులు జమిలిలో జయం మాదే అంటూ జపం చేస్తున్నారు.  

అక్కడితో ఆగడం లేదు.. ఇంతకు ఇంతా చేస్తామంటూ తొడలు చరుస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జమిలి ఎన్నికలు వస్తాయనీ, ఆ ఎన్నికలలో  విజయం మాదేననీ ధీమాగా చెబుతూ.. మేం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందన్నారు.  

ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించిన అంబటి.. జగన్ హయాంలో ఎన్నడూ ఇలా జరగలేదంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు  చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ ఆయనకు చెప్పు చూపించారనీ, ఆయినా అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చట్టపరమైన చర్యలూ తీసుకోలేదన్నారు. అలాగే ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు అప్పట్లో జగన్ ను దుర్బాషలాడినా ఆయనపైనా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని చెప్పుకొచ్చారు. అదే విధంగా చంద్రబాబు సైతం గతంలో పలుసార్లు జగన్ ను దూషించారనీ, అయినా వారెవరిపైనా అప్పటి జగన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని అంబటి రాంబాబు చెప్పారు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తూ.. జమిలి ఎన్నికలలో విజయం సాధించి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనీ, అప్పుడు ఇంతకు ఇంతా అనుభవించక తప్పదని హెచ్చరించారు.  ఇప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు.   

అయితే అంబటి మాత్రం జగన్ ఐదేళ్ల పాలనలో అధికారం ఏ స్థాయిలో దుర్వినియోగమైందో ససాక్ష్యంగా కళ్లెదుట కనిపిస్తున్నా చూడటానికీ, గుర్తించడానికీ సిద్థంగా లేరు. అయితే ఆ అధికార దుర్వినియోగన్నీ, దౌర్జన్యాలను, దుర్మార్గాలనూ జనం గత ఎన్నికలలో ఓటు ద్వారా తిరస్కరించిన కారణంగానే వైసీపీ ఇప్పుడు కనీసం విపక్ష హోదా కూడా లేకుండా మిగిలిందన్న వాస్తవాన్ని అంబటి గుర్తుంచుకోవాల్సి ఉంది.