TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ శాశ్వత, ఏకైక రాజధాని అమరావతి.. అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం

Published on: Sat Mar 28, 2026 12:16PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నేడు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని సుస్థిరం చేస్తూ, దానికి తిరుగులేని చట్టబద్ధత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.    శనివారం (మార్చి 28) ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

 గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి శాశ్వతంగా స్వస్తి పలకడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.   ఆంధ్రప్రదేశ్ ఏకైక,  శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ, భవిష్యత్తులో ఏ శక్తులు కూడా దీనిని మార్చలేని విధంగా రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా సభ్యులను కోరారు.

రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఒకే రాజధాని విధానం అత్యంత అవసరమన్నారు.   ఈ తీర్మానం  ప్రధాన ఉద్దేశ్యం కేవలం ఒక నగరాన్ని నిర్మించడం మాత్రమే కాదు, దానికి చట్టపరమైన భరోసా కల్పించడమని చెప్పారు.  గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వాలు మారినా,  రాజధాని మార్పు వంటి అంశాలు పునరావృతం కాకూడదనీ అందుకే ఈ తీర్మానాన్ని ఆమోదించాలనీ కోరారు. అసెంబ్లీలో ఈ తీర్మానం ఆమోందం పొందిన తరువాత  దీనిని తదుపరి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా  స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రసంగిస్తూ.. రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న అంశమన్నారు.  రాజధాని నిర్మాణం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, రాజకీయ ప్రయోజనాల కోసం దానిని అడ్డుకోవడం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని ఆయన ప్రస్తుతించారు.

గత ఐదేళ్లలో అమరావతి ఎదుర్కొన్న ఆటంకాలు, న్యాయపరమైన చిక్కులు,  రైతుల పోరాటాలను దృష్టిలో ఉంచుకుని  ఈ కొత్త తీర్మానం ద్వారా అందరిలోనూ భరోసా నింపడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  కాగా రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వల్ల  ఈ ప్రాంతంలో భూముల విలువ పెరగడంతో పాటు  పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.