TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతికి కేసీఆర్ ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు

Published on: Wed Oct 21, 2015 8:28PM

 

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికెళ్లి...అమరావతి శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించడం ఒక సంచలనమైతే, ఆంధ్రప్రదేశ్ ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్ అమరావతికి రానుండటం మరో సంచలనంగా మారింది. దాంతో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఎంతోమంది అతిథులు వస్తున్నా అందరి ఫోకస్ మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రిపైనే ఉంది, రాష్ట్ర విభజనకు కారకుడు కావడమే కాకుండా ఆంధ్రులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కేసీఆర్... అమరావతి వేదికగా ఏం మాట్లాడబోతున్నారనే ఆసక్తి నెలకొంది.

అయితే అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఏపీపై వరాలు జల్లు కురిపించే అవకాశముందని అంటున్నారు, ధనిక రాష్ట్రంగా, మిగులు రాష్ట్రంగా తెలంగాణ... ఆంధ్రప్రదేశ్ కి ఆర్ధిక అండదండలు అందిస్తుందో లేదో కచ్చితంగా చెప్పలేం కానీ, ఇరురాష్ట్రాల మధ్య ఇంకా కొనసాగుతున్న సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ముందుకురావొచ్చని, వాటినే అమరావతి వేదికగా ఆయన ప్రకటించే అవకాశముందని అంటున్నారు.

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రత్యేక అతిథిగా ట్రీట్ చేయాలని అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది, మర్యాదల విషయంలో కేసీఆర్ కి ఎలాంటి లోటుపాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించినట్లు చెబుతున్నారు. అధికారులకే కాకుండా మంత్రులకు, ముఖ్యనేతలకు కూడా చంద్రబాబు ఈ విధమైన ఆదేశాలు ఇచ్చారని, కేసీఆర్ మనకు ప్రత్యేక అతిథి అని, గౌరవంగా చూసుకోవాలని చెప్పారట, ఇరురాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఏర్పడటంలో కేసీఆర్ అమరావతి పర్యటన ఎంతో కీలక కానుందని భావిస్తున్న చంద్రబాబు... స్పెషల్ ట్రీట్ మెంట్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది.