TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తల్లిని చంపి ఇంట్లో పాతిపెట్టిన కూతురు

Published on: Wed Mar 25, 2026 2:50PM

 

 

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న అంజు అనే మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపగా, చిన్న కూతురు ఇషిక తల్లి అంజుతో కలిసి ఉంటోంది. అయితే సంవత్సరం క్రితం అంజు అనుమానాస్పదంగా కనిపించకుండా పోయింది. తల్లి కనిపించకపోవడంతో పెద్ద కుమార్తె ఆందోళనకు గురై జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించినప్పటికీ అంజు ఆచూకీ లభించలేదు. దీంతో కేసు ముందుకు సాగకపోవడంతో నిర్లక్ష్యానికి గురైంది.

ఇక తాజాగా అంజు పేరుతో ఉన్న వాహనాన్ని అమ్మేందుకు చిన్న కూతురు ఇషిక, ఆమె ప్రియుడితో కలిసి ప్రయత్నించింది. వాహనం కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తికి వీరు ఇచ్చిన సమాధానాలు అనుమానాస్పదంగా ఉండటంతో అతనికి సందేహం కలిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. క్లూస్ టీంతో కలిసి అంజు ఇంటికి వెళ్లిన పోలీసులు తవ్వకాలు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే… అంజు తన చిన్న కూతురు ఇషికతో కలిసి నివాసం ఉండేది. అయితే ఇషిక ప్రవర్తనపై తల్లి తరచూ అభ్యంతరం వ్యక్తం చేసేది. ఈ కారణంగా తల్లి-కూతుర్ల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గత ఏడాది కూడా ఇషిక తన ప్రియుడిని ఇంటికి తీసుకురాగా, వారిద్దరి మధ్య సరదాగా గడుపుతున్న సమయంలో తల్లి అంజు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోపోద్రిక్తులైన ఇషిక మరియు ఆమె ప్రియుడు కలిసి అంజుపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

హత్య అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే గోతిలో పాతిపెట్టి, ఎవరూ గుర్తుపట్టకుండా పైగా టైల్స్ కూడా వేసి ఆధారాలు దాచిపెట్టినట్లు దర్యాప్తులో బయటపడింది.అప్పటి నుంచి తల్లి కనిపించడంలేదని వివిధ కథలు చెప్పుతూ చిన్న కూతురు పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు తెలిసింది. ఇటీవల వాహనం అమ్మే ప్రయత్నంలో బయటపడిన అనుమానాల నేపథ్యంలో కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇంట్లో తవ్వకాలు జరపగా మట్టిలో పాతిపెట్టిన మృతదేహం బయటపడింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ దర్యాప్తు అనంతరం బయటపడనున్నాయి.