అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు
Published on: Fri Jun 19, 2026 2:53PM
.webp)
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ సోమవారం విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది.
ఈ కేసులో అల్లు అర్జున్ను A-11 నిందితుడిగా చేర్చిన చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. A1 నుంచి A10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్న పోలీసులు, మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. వీరిలో 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. నిందితులందరూ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరైన అనంతరం కేసు ట్రయల్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
గత ఏడాది డిసెంబర్ 4న 'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కూడా శ్రీతేజ్ పూర్తిగా కోలుకోలేదని సమాచారం.
ఈ ఘటనపై నమోదైన కేసులో దర్యాప్తు పూర్తి చేసిన చిక్కడపల్లి పోలీసులు ఇటీవల కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ను పరిశీలించిన నాంపల్లి కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది. నిందితుల వ్యక్తిగత హాజరు అనంతరం అభియోగాల నమోదు ప్రక్రియ పూర్తి చేసి కేసు ట్రయల్ను ప్రారంభించే అవకాశం ఉందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.
పుష్ప-2 వివాదం: ఊహాజనిత వార్తలు, డిబేట్లపై కోర్టు మధ్యంతర ఆదేశాలు
సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన కేసులో హైదరాబాద్ నగర సివిల్ కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో వాస్తవ నిర్ధారణకు ముందే ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఊహాజనిత వార్తలు, అసత్య ప్రచారాలు, ఆధారరహిత ఆరోపణలు, వాస్తవాలకు విరుద్ధమైన చర్చలు, డిబేట్లు, వార్తా కథనాలు లేదా సోషల్ మీడియా పోస్టులు ప్రచురించరాదని కోర్టు స్పష్టం చేసింది.
సంధ్య థియేటర్కు సంబంధించిన O.S. No.216 of 2026లో I.A. No.369 of 2026 పిటిషన్పై విచారణ జరిపిన హైదరాబాద్ నగర సివిల్ కోర్టు గౌరవ వేకేషన్ సివిల్ జడ్జి-కమ్-XXV అదనపు చీఫ్ జడ్జి జూన్ 4, 2026న Ad-Interim Ex Parte Injunction ఉత్తర్వులు జారీ చేశారు.
కోర్టు ఆదేశాల ప్రకారం కేసుకు సంబంధించిన అంశాలపై తుది విచారణ పూర్తయ్యే వరకు నిర్ధారణ కాని ఆరోపణలు, ఊహాగానాలు లేదా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేయరాదని స్పష్టం చేసింది. అలాగే మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫారమ్లు, సోషల్ మీడియా వేదికలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కోర్టు ఆదేశాలను గౌరవించాలని సూచించింది. ఈ ఉత్తర్వులు కేసులో తుది తీర్పు వెలువడే వరకు అమల్లో ఉంటాయని, కోర్టు ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని న్యాయస్థానం పేర్కొంది.


