ఎంపీ టికెట్ కోసం జగన్ ని కలిసిన నాగార్జున!!

 

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష వైసీపీ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తుంది. ఇప్పటికే అధికార టీడీపీ నుంచి కొందరు నేతలు వైసీపీ గూటికి చేరారు. మరికొందరు చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ వార్తలొస్తున్నాయి. దీనికితోడు నిన్నటికి నిన్న జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు జగన్ తో భేటీ అయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నార్నె వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు మరో సెన్సేషనల్ న్యూస్ తెరమీదకు వచ్చింది. హీరో నాగార్జున తాజాగా జగన్ తో భేటీ అయ్యారు. దీంతో నాగార్జున వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారంటూ వార్తలొస్తున్నాయి.

ఈరోజు హైదరాబాద్ లోని లోటస్‌పాండ్‌లో జగన్‌ తో నాగార్జున భేటీ అయ్యారు. ప్రస్తుతం ఈ భేటీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నాగార్జున త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తున్నారని, అందుకే జగన్ తో భేటీ అయ్యారని అంటున్నారు. నాగార్జున గుంటూరు ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. ఇదే విషయాన్ని జగన్ వద్ద ప్రస్తావించగా జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం ఈ భేటీ ఎంపీ సీటు గురించే.. కానీ, పోటీ చేసేది మాత్రం నాగార్జున కాదు అంటున్నారు. నాగార్జున మిత్రుడు అయిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త టికెట్ కోసం నాగార్జున జగన్ ని కలిశారు అంటున్నారు. మరి నాగార్జున తన ఎంపీ టికెట్ కోసం కలిసారో?.. తన మిత్రుడి ఎంపీ టికెట్ కోసం కలిసారో? లేక రాజకీయంగా కాకుండా కేవలం మర్యాదపూర్వకంగా కలిసారో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.