అఖండ గోదావరి ప్రాజెక్టుకు 19న శంకుస్థాపన.. పర్యాటకానికి కొత్త సొబగు
Published on: Sat Jun 7, 2025 1:04PM

అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పురందేశ్వరి రాజమహేంద్రవరంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాజమహేంద్రవరం నగరం, గోదావరి పర్యాటక ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయి. రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.
చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. సందర్శకులకు మెరుగైన వసతుల కల్పనను కూడా ఈ ప్రాజెక్టులో భాగం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతిష్ఠాత్మక అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనుంది. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పథకం ద్వారా మంజూరైన రూ.97 కోట్లతో రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, కడియం, కొవ్వూరు, నిడదవోలు తదితర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పనులు జరగనున్నాయి. పుష్కరాల లోపే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.


