పివి, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చండి.. అక్బరుద్దీన్ సెన్సేషనల్ కామెంట్స్

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీలు, నేతల మధ్య ఇంతకూ ముందు ఎపుడు లేనంతగా మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో 4,700 ఎకరాల హుస్సేన్‌సాగర్ ప్రస్తుతం 700 ఎకరాలు కూడా లేదన్నారు. అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటోందని.. దీనిలో భాగంగా హుస్సేన్‌సాగర్ కట్టపై ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలని అయన కామెంట్ చేసారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని... మళ్లీ ఈ ఎన్నికల్లో మాయ మాటలు చెబుతున్నారని ప్రభుత్వంపై అక్బరుద్దీన్ మండిపడ్డారు. ఎంఐఎంతో పొత్తు లేదని మంత్రి కేటీఆర్ అంటున్నారని... తమకు ఎవరి కింద బతకాల్సిన దుస్థితి లేదని అయన అన్నారు. తాము అడుగేస్తే దుమ్ము లేస్తుందని.. అసెంబ్లీలో తోకను తొక్కి టీఆర్ఎస్ ను ఎలా నిలబెట్టాలో, ఎలా కూర్చోబెట్టాలో కూడా తమకు తెలుసని అన్నారు. తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కనుసన్నల్లోనే ఓల్డ్ సిటీ నడుస్తుందని అక్బరుద్దీన్ ఓవైసి పేర్కొన్నారు.