అజిత్ దోవల్ దెబ్బకు దిగొచ్చిన తబ్లిగీ జమాత్‌

*  కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న క్రైమ్ బ్రాంచ్

* ప్రతి అంగుళం గాలిస్తున్న ఎఫ్ఎస్ఎల్ పత్రినిధులు
* మౌలానాల సమక్షంలోనే తనిఖీలు , వీడియో చిత్రీకరణ

జాతీయ భద్రతా సలహాదారు ( ఎన్ ఎస్ ఏ) అజిత్ దోవల్ దెబ్బకు దెయ్యం వదిలింది. ఆయన జోక్యం తర్వాత, పోలీస్ యంత్రాంగం లో కదలిక మొదలైంది. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని తబ్లిగీ జమాత్‌ కార్యాలయాన్ని నిన్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎస్ఎన్ఎల్) ప్రతినిధుల సంయుక్త బృందం పరిశీలించింది. మార్చిలో ఈ కేంద్రంలో జరిగిన సమావేశానికి దేశం నలుమూలల నుంచి పలువురు హాజరుకావడం, ఆ తర్వాత వీరిలో చాలామందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం తెలిసిందే. దీంతో సమావేశానికి హాజరైన వారిని ఎక్కడికక్కడ గుర్తించి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కేంద్రంలోని వారందరినీ ఖాళీ చేయించిన అనంతరం రెండు రోజులపాటు వైరస్ నివారణ చర్యలు చేపట్టారు.

అనంతరం ఈ భవనంలోకి ప్రవేశించడం సురక్షితమన్న సర్టిఫికెట్ వైద్యశాఖ ఇవ్వడంతో నిన్న రెండు విభాగాలకు చెందిన సైబర్ ఫోరెన్సిక్ యూనిట్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ తోఫాటు ఫొటో డివిజన్ ప్రతినిధులు కేంద్రంలోని రెండు విభాగాల్లోని ఐదంతస్తులను పరిశీలించారు. దాదాపు ఆరు గంటలపాటు భవనంలోని ఆమూలాగ్రం పరిశీలించిన బృందం ప్రతినిధులు భవనం మొత్తాన్ని మ్యాప్ చేశారు. వీడియో షూట్ చేశారు. భవనంలో చాలా రహస్య అరలు ఉన్నట్లు గుర్తించారు.

ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ 'మాతోపాటు మేనేజ్మెంట్ కమిటీకి చెందిన మౌలానాలను కూడా తీసుకువెళ్లాం. వారి సమక్షంలోనే భవనంలోని కార్యాలయం నుంచి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. మార్చినెలలో రికార్డయిన సీసీ టీవీ పుటేజీ ఇవ్వాలని భవనం మేనేజరుని అడిగాం. అవసరమనుకుంటే మరోసారి భవనాన్ని సందర్శిస్తాం' అని తెలిపారు.

'ఇది చాలా సీరియస్ కేసు అయినప్పటికీ సున్నితమైన అంశాలతో ముడిపడివుంది. అందువల్ల ఆచితూచి అడుగు వేస్తున్నాం. అయినప్పటికీ అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు పూర్తయ్యాక న్యాయనిపుణుల సలహా కూడా తీసుకున్న తర్వాత ఏ విధంగా అడుగు ముందుకు వేయాలన్నదానిపై ఓ నిర్ణయానికి వస్తాం' అని ఆ పోలీసు అధికారి వివరించారు.
కాగా, బృందం సభ్యులు భవనం లోపలి భాగాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లే ముందు, తిరిగి వచ్చేటప్పుడు ప్రవేశ ద్వారం వద్దే వారికి పూర్తిగా వైద్యపరమైన తనిఖీలు నిర్వహించారు. పరిస్థితిని  నియంత్రించటానికి, చివరకు నేషనల్ సెక్యూరిటీ ఎడ్వైసర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సీనియర్ అధికారులే చెపుతున్నారు.