టీడీపీ సమాచారం మేరకు జగన్‌పై దాడి జరగొచ్చు

 

ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ పై మళ్ళీ దాడి జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ ఈనెల 9న ఇచ్ఛాపురంలో ప్రజా సంకల్ప యాత్రకు  ముగింపు పలుకుతూ పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. తాజాగా పైలాన్ పనులను పరిశీలించిన భూమన..విలేకరులతో మాట్లాడుతూ.. జగన్‌ ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్ర మొదలుకొని టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అడ్డుపడుతున్నా సజావుగా సాగిందన్నారు. పాదయాత్రలో వచ్చిన ప్రజాదరణ చూడలేక టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజల సహకారంతో పాదయాత్ర దిగ్విజయంగా జరుగుతోందన్నారు. జగన్‌ పాదయాత్ర పూర్తయిన వెంటనే తిరుమలకు అలిపిరి నుంచి కాలి నడకన వెంకన్న దర్శనానికి వెళ్లనున్నారని, ఈ సందర్భంగా సంఘ విద్రోహ శక్తులు జగన్‌పై దాడి చేసే అవకాశం ఉందని టీడీపీ నుంచే సమాచారం వచ్చిందన్నారు. జగన్‌పై హిందుత్వ దాడి చేసే కుట్రకు చంద్రబాబు తెరతీస్తున్నారని మాకు సమాచారం వచ్చిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.