TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్లీ కరోనా పంజా.. భారీగా పాజిటివ్‌ కేసులు..

Published on: Mon Apr 25, 2022 12:58PM

రెండేళ్లుగా ప్రపంచ జనాభాను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ గత కొద్ది రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో అందరం ఊపిరి పీల్చుకుంటున్నాం. అయితే.. విజృంభణను కొద్దిగా తగ్గించిన కరోనా పలు రూపాంతరాలు మార్చుకుంటూనే ఉంది. ఇప్పుడు ఒమిక్రాన్ తాజా వేరియంట్లతో మళ్లీ విరుచుకుపడుతోంది. కరోనా పుట్టుకకు మూలకారణం అని ప్రపంచం మొత్తం భావిస్తున్న చైనాలో మళ్లీ విజృంభించి అక్కడి జనజీవనాన్ని అష్టదిగ్బంధనం చేస్తోంది. బ్రిటన్, అమెరికా దేశాల్లో కూడా తన ప్రతాపం చూపిస్తోంది. వాటితో పాటుగా భారతదేశంలో కూడా కరోనా కేసులు గత కొద్ది రోజులుగా కోరలు చాస్తోంది. ప్రజలను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది.

దేశంలో గడచిన 24 గంటల్లో 2 వేల 541 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి వెయ్యి 862 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా మహమ్మారికి 30 మంది బలైపోయారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో కరోనా మరింత ఎక్కువగా విరుచుకుపడుతోంది. అంతకు ముందు వారంతో పోల్చితే.. ఈ వారం రోజుల్లో ఆ 12 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 16 వేలు దాటిపోయింది. కరోనా వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 5 లక్షల 22 వేల 223 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.

దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 18 నుంచి 24వ తేదీ మధ్య కాలంలో15 వేల 700కు పైగా కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. అంతకు ముందు వారం 8 వేల కేసులు నమోదయ్యాయి. అంటే కొత్త కేసుల సంఖ్య 95 శాతం పెరిగిందన్నమాట. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 187 కోట్ల డోసుల పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించిన గణాంకాలను చూస్తే.. రోజువారీ పాజిటివిటీ రేటు 0.84 శాతం ఉంది. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 16 వేల 522 మంది కరోనాతో బాధపడుతున్నారు.