అస్సాంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం.. 12 వేల పందులను చంపేయాలని ప్రభుత్వ ఆదేశం

భారత్ లో కరోనా ఇప్పటికే కల్లోలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా మరణాలు 90 వేలకు చేరగా మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 57 లక్షలకు చేరుకున్నాయి. ఇది ఇలా ఉండగా అస్సాం రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ప్రమాదకరమైన ఈ ఫ్లూ కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 వేలకు పైగా పందులు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాధి కొత్త ప్రాంతాలకు విస్తరించకుండా కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ్యాపించిన ప్రాంతాల్లోని 12 వేల పందులను చంపేయాలని.. వాటి యజమానులకు నష్ట పరిహారం అందించాలని అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ అధికారులను ఆదేశించారు. అధికారులతో జరిగిన అత్యవసర సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా, నిపుణుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని పందులను వధించాలని ఈ మొత్తం ప్రక్రియ దసరాకు ముందే పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 30 ప్రభావిత ప్రాంతాల్లో కిలోమీటర్ పరిధిలోని పందులను వధించనున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. అలాగే నష్టపరిహారాన్ని వాటి యజమానులు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు తెలిపారు.