అద్వానీ శకం ముగిసినట్లేనా?

 

 

 

బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ శకం దాదాపుగా ముగిసిపోతున్నట్లే కనిపిస్తోంది. ఆయన ఏం అనుకున్నా అది అవ్వడంలేదు. నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి ఆయన ససేమిరా అన్నారు. అయినా తప్పలేదు. ఇప్పుడు తన సొంత అభ్యర్థిత్వం విషయంలోనూ చుక్కెదురైంది. ఇన్నాళ్లూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ లోని గాంధీనగర్ కాకుండా, మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి బరిలోకి దిగాలని ఆయన భావించినా, పార్టీ మాత్రం అద్వానీకి గాంధీనగర్ టికెట్టే కేటాయించింది. మోడీ కోసం భోపాల్ స్థానాన్ని వదులుకునేందుకు సిద్ధమని పార్టీ సిట్టింగ్ ఎంపీ, సీనియర్ నేత కైలాశ్ జోషీ ప్రకటించినా బీజేపీ అధిష్టానం మాత్రం అద్వానీకి ఆ సీటును కేటాయించేందుకు ససేమిరా అంది. అద్వానీ ఈసారి కూడా గాంధీనగర్ స్థానం నుంచే తిరిగి పోటీ చేయాలని నిర్ణయించింది.