TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజమహేంద్రవరంలో కల్తీపాలు.. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా

Published on: Mon Feb 23, 2026 1:54PM

రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి  నలుగురు మరణించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కల్తీపాలు తాగి ఇద్దరు మరణించడమే కాకుండా పలువురు తీవ్ర అస్వస్థతకు గురికావడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ నేపథ్యంలో  ఈ ఘటనపై  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో స్పందించారు.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారని, మరో 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన ఆయన మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అసెంబ్లీకి తెలిపిన ఆయన . కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు.

అంతకుముందు   కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫుడ్ సేఫ్టీ, వైద్యారోగ్య శాఖ అధికారులు తక్షణం రాజమండ్రి వెళ్లాలని ఆదేశించారు. కల్తీ పాల కారణంగానే మరణాలు సంభవించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని జిల్లా కలెక్టర్ చెప్పారు.  పాల శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్ పంపించామని, రెండు రోజుల్లో నివేదిక వస్తుందని అన్నారు. ఈ ఘటన జరిగిన చౌడేశ్వరి నగర్ ప్రాంతంలో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. బాధితులకు పాలు పోసిన వ్యాపారి గణేశ్ ను పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.  46 మంది రైతుల దగ్గర నుంచి పాలు సేకరించి ఆ పాలను 106 కుటుంబాలకు సరఫరా చేసినట్లు గుర్తించిన అధికారులు..  ఆయా ఇళ్లలోని వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.