ఆదిలాబాద్ ను హడలెత్తిస్తున్న మావోయిస్టులు
Published on: Fri May 4, 2012 9:56AM
మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న ఆదిలాబాద్ జిల్లాను మావోయిస్టులు హడలెత్తిస్తున్నారు. గత రెండు నెలలుగా ఈ జిల్లాలో మావోయిస్టుల సంచారం బాగా పెరిగింది. మావోయిస్టులు నిర్భయంగా గ్రామాల్లో తిరుగుతూ సభలు నిర్వహిస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులను ప్రజాద్రోహులుగా ప్రకటించి పదవులకు రాజీనామా చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. తాము చెప్పినట్లు చేయకపోతే ప్రజాకోర్టులో వారిని శిక్షిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఈ మేరకు అనేక గ్రామాలో మావోయిస్టుల పేరిట వాల్ పోస్టర్లు కూడా వెలిశాయి. మావోయిస్టుల వార్నింగులకు భయపడి ఇప్పటికే 42మంది ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి రాజీనామా లేఖలను జిల్లా కలెక్టర్ కు, జెడ్.పి.సి.ఇ.ఓ.కు పంపించారు. ఆదిలాబాద్ లో మావోయిస్టుల కదలికలు రాజకీయనాయకులకు ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు మాత్రం పట్టణాల వరకే పరిమితమై గ్రామాల్లోకి రాకపోవటంతో మావోయిస్టుల సంచారానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.


