రోశమ్మకు బాలకృష్ణ సహాయం
posted on Dec 27, 2013 11:27AM
మద్యపాన వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించి రాష్ట్రంలో మద్య నిషేధం విధించేలా చేసిన నెల్లూరు జిల్లా దూబగుంటకు చెందిన ఉద్యమకారిణి రోశమ్మ గుర్తుందా. మద్య నిషేధం ఎత్తేసిన తరువాత ఆమె ఎవరికీ పట్టకుండా పోయింది. అయితే ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రస్తుతం నెల్లూరులోని బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఆమె ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న సినీ నటుడు బాలకృష్ణ... రోశమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆమెకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. రెండు కిడ్నీలు చెడిపోయి నెల్లూరులోని బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోశమ్మకు బాలకృష్ణ సేవా సమితి తరఫున దాని కన్వీనర్, టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి రూ.25 వేలు అందజేశారు. అనంతరం ఆయన బాలకృష్ణకు ఫోన్ చేయగా రోశమ్మతో ఆయన మాట్లాడారు. అనారోగ్యంపై చింతించవద్దని, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వైద్యం, ఇతరత్రా సహాయాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు అండగా నిలుస్తారని రోశమ్మకు భరోసా ఇచ్చారు.