ప్రణయ్‌ హత్య కేసు.. మారుతీరావుకు బెయిల్‌

 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్‌ మంజూరైంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సెప్టెంబరు 14న ప్రణయ్‌ దారుణ హత్యకు గురయ్యాడు. తన కూతురు అమృత.. ప్రణయ్ ని కులాంతరం వివాహం చేసుకుందన్న కోపంతో.. అమృత తండ్రి తిరునగరి మారుతీరావు సుపారీ ఇచ్చి.. ప్రణయ్‌ను హత్య చేయించాడు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మారుతీరావు, ఆరో నిందితుడైన అతడి సోదరుడు శ్రవణ్‌కుమార్‌, ఐదో నిందితుడు కరీంలపై గత ఏడాది సెప్టెంబరు 18న పోలీసులు ముందస్తు నిర్బంధం (పీడీ) చట్టం కింద కేసు నమోదు చేశారు. వీరు బెయిల్‌పై బయటకు వస్తే.. ప్రణయ్‌ కుటుంబానికి ప్రమాదమని భావించిన పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు. ప్రస్తుతం వీరు వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు. నిందితులు ఎప్పటికప్పుడు బెయిల్‌ కోసం పిటిషన్‌లు దాఖలు చేస్తున్నా.. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు శక్తిమంతమైన కౌంటర్లు వేసి, బలమైన వాదనలు వినిపిస్తూ వచ్చారు. పీడీ కేసులో మారుతీరావుతోపాటు.. శ్రవణ్‌, కరీం తాజాగా మరోసారి బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. వాదోపవాదాలు విన్న కోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ కాపీలు వరంగల్‌ జైలు అధికారులకు చేరగానే.. ఆ ముగ్గురూ విడుదల అవుతారు.