జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావుకు తీవ్ర అస్వస్థత

 

విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావుకు.. నిన్న రాత్రి పది గంటల తర్వాత ఛాతిలో తీవ్ర నొప్పి రావడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీల కోసం ఆసుపత్రి ఉంది. సాధారణ రోగాలకు అక్కడే వైద్యం అందిస్తుంటారు. అయితే శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉండడంతోనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఒకవేళ అతని ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోతే.. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం అతన్ని కాకినాడ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్టు సమాచారం.