గచ్చిబౌలిలో నిర్మాణ పనుల్లో విషాదం.. ముగ్గురు కార్మికులకు గాయాలు..!

posted on: Jul 30, 2026 4:41PM

 

గచ్చిబౌలిలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మట్టి కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. కాసేపటి క్రితం వరకు సాధారణంగా సాగిన పనుల్లో ఒక్కసారిగా ప్రమాదం చోటుచేసుకోవడంతో అక్కడ ఆందోళన నెలకొంది.

రోజువారీ పనుల్లో భాగంగా కార్మికులు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ తమ విధుల్లో నిమగ్నమయ్యారు. అపార్ట్‌మెంట్ నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్ల కోసం తవ్విన గుంతల్లో సిమెంట్ బెడ్ వేసే పనులు చేస్తున్నారు. అదే సమయంలో పైభాగంలోని మట్టి ఒక్కసారిగా కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మట్టిలో చిక్కుకుని గాయపడ్డారు.

ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎన్‌జీవోస్ కాలనీ, గౌలిదొడ్డి సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న ఇతర కార్మికులు అప్రమత్తమై మట్టిలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అనంతరం గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు వివరాలు సేకరించారు. నిర్మాణ పనుల సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించారా? మట్టి కూలిపోవడానికి కారణాలు ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నిర్మాణ ప్రాంతంలో భద్రతా చర్యల అమలుపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంతో నిర్మాణ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది.

Accident in Gachibowli, Apartment construction work, TNGOS Colony, gowlidoddi

google-ad-img
    Related Sigment News
    • Loading...