TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అక్రమాస్తుల కేసులో అదనపు ఎస్పీ భుజంగరావుపై ఏసీబీ కేసు

Published on: Wed Jun 3, 2026 6:48PM

 

తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సస్పెన్షన్‌లో ఉన్న అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) నాయిని భుజంగరావుపై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేప థ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. అవినీతి నిరోధక చట్టం–1988 (2018 సవరణలతో)లోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం భుజంగరావు నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీలు మరియు ఇతర అనుబంధ వ్యక్తులకు చెందిన మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

సోదాల్లో సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 27.29 ఎకరాల వ్యవసాయ భూములు, ఐదు ఖాళీ ప్లాట్లు, రెండు నివాస గృహాలు, హైదరాబాద్‌లో ఒక వాణిజ్య భవనానికి సంబంధించిన పత్రాలు గుర్తించినట్లు వెల్లడించారు. అదనంగా రూ.3.83 లక్షల నగదు, రూ.8 లక్షల బ్యాంకు నిల్వలు, సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, ఒక మారుతి స్విఫ్ట్ కారు, ఒక కియా సెల్టోస్ వాహనం కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ రూ.5.92 కోట్లకు పైగా (రూ.5,92,54,500)గా అంచనా వేసినట్లు ఏసీబీ పేర్కొంది. 

అయితే స్థిరాస్తుల మార్కెట్ విలువ పత్రాల్లో నమోదైన విలువ కంటే మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.సోదాల సమయంలో భుజంగరావు నివాసంలో 29 మద్యం సీసాలు కూడా లభ్యమైనట్లు వెల్లడించారు. ఈ విషయంపై తదుపరి చర్యల కోసం ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు.

మరిన్ని ఆస్తుల వివరాలపై విచారణ కొనసాగుతోందని, కేసు దర్యాప్తు దశలో ఉందని ఏసీబీ పేర్కొంది. నిందిత అధికారిని నాంపల్లిలోని ఎస్‌పీఈ అండ్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరచి న్యాయపరమైన రిమాండ్ కోరనున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేసిన సందర్భాల్లో ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేసింది