TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏబీవీ కొత్త పార్టీ.. కులం కాదు.. వ్యక్తిత్వమే అభ్యర్థుల ఎంపికకు కొలమానం

Published on: Sat May 9, 2026 5:56PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మరో కీలక మలుపు తిరగబోతోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన..  ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను..  ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు. ఇదే స్ఫూర్తితో ఏపీలో కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని చెప్పారు. 

రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై  తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఏబీ వెంకటేశ్వరరావు,  ఏపీలో ప్రతి చిన్న విషయానికి కులం రంగు పులుముతున్నారని, మంచినీళ్ల నుంచి ఇంటి అద్దె వరకు కుల ప్రాతిపదికన లెక్కలు వేసే వాతావరణం నెలకొందని   విమర్శించారు. తన కొత్త పార్టీ కేవలం  వ్యక్తిత్వం ప్రాతిపదికన మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తుందనీ,  ఎట్టి పరిస్థితుల్లోనూ వివాదాస్పద వ్యక్తులకు, అవినీతిపరులకు చోటు ఉండదని స్పష్టం చేశారు.

జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం చేసిన తప్పులను, దోపిడీని అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో జరిగిన వేల కోట్ల అవకతవకలు, ఇండోసోల్ ప్రాజెక్టుల పేరుతో జరిగిన సబ్సిడీల కుంభకోణాలను ఆయన ఈ సందర్భంగా ఎత్తిచూపారు. ఇలాంటి  ప్రమాదకరమైన  రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ఇప్పటి వరకు కేవలం మీడియా ద్వారానే ప్రజా సమస్యలపై పోరాటం చేశాననీ,  ప్రభుత్వాలను కదిలించాలంటే ఒక వ్యవస్థీకృత రాజకీయ వేదిక అవసరమని  గుర్తించానని చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అందుకే ఒక పొలిటికల్ పార్టీగా అవతరించి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా, బాధ్యతాయుతమైన పాలనను అందించడమే తన కర్తవ్యమని  వివరించారు.

భవిష్యత్ నాయకత్వంపై అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్న వ్యక్తిగా ఇతర పార్టీల అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడం సబబు కాదని చెబుతూనే..  వ్యవస్థలో మార్పు రావలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.  

 ఏబీ వెంకటేశ్వరరావు  కొత్త రాజకీయ ప్రయాణం ఏపీ ప్రజల్లో ఎలాంటి మార్పు తీసుకువస్తుంది? సాంప్రదాయ పార్టీలకు ఆయన తన పార్టీతో చెక్ పెట్టగలరా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.