నా సస్సెన్షన్ సరే.. జగన్, శ్రీలక్ష్మి సంగతేంటి?.. ఏబీవీ
Published on: Sat Jul 2, 2022 6:55AM
తనను మళ్లీ సస్పెండ్ చేయడంపై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. ముఖ్యమంత్రి జగన్, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి వర్తించని నిబంధనలు తనకు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. తనపై ఒక్క చార్జిషీట్ కూడా లేదని చెప్పిన ఆయన ముఖ్యమంత్రి జగన్ పై 12 సీబీఐ కేసులు ఉన్నాయనీ, ఆరు ఈడీ కేసుల్లో చార్జ్ షీట్లు ఉన్నాయనీ ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారు.
అలాగే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కూడా కేసులు, చార్జిషీట్లు ఉన్నాయని చెప్పారు. వారు పదవుల్లో, కొలువుల్లో కొనసాగుతుంటే.. ఒక్క చార్జి షీట్ కూడా లేని తనను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. తన సంతకాలను ఫోర్జరీ చేశారని సీఎస్ కు మూడు సార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే ఇజ్రాయెల్ కంపెనీ అంటుంటారని… అదేమైనా సూట్ కేస్ కంపెనీనా లేక కోల్ కత్తా కంపెనీనా అని ఏబీవీ ప్రశ్నించారు.
కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి, వ్యవస్థకు చెడ్డపేరు వస్తున్నదని అన్నారు. సీఎంకు కానీ, సీఎస్ కు కానీ, డీజీపీకి కానీ కొన్ని పరిమితులు ఉంటాయని.. పరిమితులు దాటి ఎవరూ వ్యవహరించకూడదని అన్నారు. తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ కోర్టులో నిలవదని ధీమా వ్యక్తం చేశారు.తనపై జగన్ సర్కార్ కక్ష కట్టడానికి కారణం కోడి కత్తి సంఘటనేనని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి ఘటన సాకుతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని అనుకున్నారనీ, అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న తాను అడ్డుకున్నాననీ వివరించారు. రిటైర్ అయ్యేంత వరకు ఖాకీ యూనిఫామ్ వేసుకోకుండా చేస్తామని మరో ప్రజాప్రతినిధి తనను బెదిరించారని ఏబీవీ అన్నారు. ప్రస్తుతం తాను చేయగలిగింది న్యాయ పోరాటం, ధర్మ పోరాటం మాత్రమేనని చెప్పారు.


