టి.ఆర్.ఎస్., బిజెపి మధ్య పేలుతున్న మాటల తూటాలు
Published on: Wed May 2, 2012 9:57AM
నిన్నమొన్నటి వరకూ ప్రత్యేక తెలంగాణా కోసం చేయి చేయి కలిపి ఉద్యమించిన తెలంగాణా రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు ఇప్పుడు పరస్పరం కలహించుకుంటున్నాయి. ఈ పార్టీల నాయకులు చీటికీ మాటికీ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. పాలమూరులో టి.ఆర్.ఎస్. అభ్యర్థిని బిజెపి అభ్యర్థి ఓడించినప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య తెలంగాణాప్రాంతంలో వైరం ప్రారంభమైంది. పాలమూరులో బిజెపి గెలుపును టి.ఆర్.ఎస్. జీర్ణించుకోలేకపోతోంది.
ఇప్పటిదాకా తెలంగాణా సెంటిమెంట్ కు తమ గుత్తాధిపత్యంగా భావించిన టి.ఆర్.ఎస్. ఇకపై తమకు బిజెపి పోటీగా మారుతుందని భయపడుతుంది. బిజెపి జాతీయపార్టీ కావటం, ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక తెలంగాణా కు మద్దతు పలకటంతో తెలంగాణా ప్రజలు కూడా ఆ పార్టీని విశ్వ సిస్తున్నారు. కేంద్రలో బిజెపి అధికారంలోకి వస్తే వెంటనే తెలంగాణా ఇస్తామని ఆ పార్టీ జాతీయనాయకులు పదేపదే ప్రకటిస్తున్నారు. మరోవైపు టి.ఆర్.ఎస్. వ్యవహారశైలి, తెలంగాణా సాధనకు ఆ పార్టీ విధిస్తున్న డెడ్ లైన్ లు తెలంగాణా ప్రజలకు విసుగుకలిగిస్తున్నాయి. ఇది గమనించిన టి.ఆర్.ఎస్. హఠాత్తుగా వ్యూహాన్ని మార్చుకుంది. అవకాశం దొరికి నప్పుడల్లా బిజెపి నాయకులపై విమర్శలు గుప్పిస్తోంది. బిజెపి లాంటి మతతత్వ పార్టీలకు తెలంగాణా తెచ్చే సామర్థ్యంలేదని ఎద్దేవా చేస్తోంది. అయితే తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ దాడులకు పాల్పడుతున్న టి.ఆర్.ఎస్. నాయకులను ప్రజలే తిప్పికొడతారని బిజెపి అంటోంది. టి.ఆర్.ఎస్. పుట్టుక ముందునుంచే తెలంగాణా విద్యావంతుల వేదిక, జనసంఘ్ లు ప్రత్యేక తెలంగాణా కోసం పోరాడుతున్న విషయం కేసీఆర్ గుర్తుంచుకోవాలని వారు అంటున్నారు.


