TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇండియా కూటమి నుంచి వైదొలగిన ఆప్.. బీహార్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడి

Published on: Sat Jul 19, 2025 12:13PM

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇండియాకు భారీ షాక్ తగిలింది. ఇండియా కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)  ప్రకటించింది. సరిగ్గా పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముంగిట కూటమి నుంచి వైదొలగుతూ ఆప్ తీసుకున్న నిర్ణయం ఇండియా కూటమికి ఇబ్బందికరమేననడంలో సందేహం లేదు. పార్లమెంటులో అధికార ఎన్డీయే కూటమిని ఇరుకున పెట్టాలని భావిస్తున్న ఇండియా కూటమికి ఇప్పుడు ఒక భాగస్వామ్యపక్షం వైదొలగడం మింగుడుపడని అంశమే.

 పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు లేవనెత్తాల్సిన అంశాలపై శనివారం (జులై 19) ఇండియా కూటమి సమావేశం కానున్న సమయంలో  ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడమే కాకుండా, కూటమి సమావేశానికి కూడా హాజరు కావడం లేదని స్ఫష్టం చేసింది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ కూటమి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. అయితే తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇండియా కూటమి సమావేశానికి హాజరు కానున్నారు.  

ఐక్యత విషయంలో ఇండియా కూటమి వైఫల్యాన్ని కారణంగా చూపుతూ ఆప్ కూటమి నుంచి వైదొలగుతున్నట్లు శుక్రవారం (జులై 18) ప్రకటించిన సంగతి విదితమే.  అయినా ఇండియా కూటమితో పొత్తు కేవలం లోక్‌సభ ఎన్నికల వరకేననీ, ఆ తరువాత జరిగిన  ఢిల్లీ, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో తాము ఒంటరిగానే బరిలోకి దిగామనీ ఆప్ గుర్తు చేసింది. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలోనూ ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేసింది.