పదవుల పందారం ... 'అప్'డే ముసలం?
posted on Dec 26, 2013 2:27PM
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయా? అవుననే ఢిల్లీ రాజకీయవర్గాలు అంటున్నాయి. ఢిల్లీ పీఠాన్ని అధిష్టించనున్న ఆమ్ ఆద్మీ ... అరడజను మంది మంత్రుల్ని సైతం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో మంత్రిపదవి ఆశిస్తున్న మరికొందరు ఆశావాహుల్లో ఆగ్రహం చోటుచేసుకుందని సమాచారం. వీరిలో ముక్యంగా ఎం.ఎల్.ఎ. వినోద్ తీవ్రమైన ఆశాభంగానికి గురయ్యారని, ఆయన మీడియా సమావేశం నిర్వహించి తన కోపాన్ని వెళ్లగక్కనున్నారనే వార్తలు ఢిల్లీ రాజకీయాన్ని మరోసారి వేడెక్కించాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు తమ బాధ్యతను విజయవంతంగా నిర్వహించారని వినికిడి. వీరి ద్వారా వినోద్ ను బుజ్జగించే కార్యక్రమం పూర్తయిందని, ఆయనకు ముఖ్యమంత్రి సమక్షంలో బాధ్యతలు నిర్వర్తించే మరో ప్రధాన పదవిని ఇచ్చేందుకు నిర్ణయం జరిగిందని సమాచారం.