రాహుల్ పై 'ఆమ్ఆద్మీ' అభ్యర్ధి పోటీ?
posted on Dec 27, 2013 11:00AM
ఢిల్లీ పీఠ౦ దక్కించుకున్న ఆమ్ఆద్మీ పార్టీ తర్వాతి టార్గెట్ ఏమిటి? మనలో ఎవరికైనా ఇలాంటి అనుమానం ఉంటే దాన్ని ఆ పార్టీ నేత కుమార్ విశ్వాస్ నివృత్తి చేశారు. ఆయన ఈ ఈరోజు ఉత్తరప్రదేశ్ లోని రాహుల గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధీ సందర్శించనున్నారు. అక్కడ జాదు సందేశ్ యాత్రలో పాల్గొననున్నారు. అంతేకాదు నియోజకవర్గంలో ప్రజాసమస్యల పరిస్థితిని సమీక్షించనున్నారు. ఉత్తరప్రదేశ్లో ఆమ్ఆద్మీ తొలి అడుగుగా దీన్ని రాజకీయవిశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనే ఆలోచనతో ఉన్న ఆమ్ఆద్మీ ..దేశ వ్యాప్తంగా కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలపైనే దృష్టి సారించిందని, అందులో భాగంగానే రాహుల్ నియోజకవర్గాన్ని లక్ష్యం చేసుకుందని విశ్లేషకుల అభిప్రాయం. ఈ యాత్రలోపాల్గొనడమే కాకుండా అక్కడ తమ పార్టీ కార్యకర్తలతో విశ్వాస్ సమావేశం కూడా నిర్వహించనున్నారని సమాచారం. కొసమెరుపు ఏమిటంటే..రానున్న లోకసభ ఎన్నికలలో రాహుల్ ప్రత్యర్ధిగా ఆమ్ఆద్మీ విశ్వాస్ పేరు ఇప్పటికే తెరపైకి రావడం. ఒకవైపు కాంగ్రెస్ మద్దతుతో గద్దెనెక్కిన ఆమ్ఆద్మీ అదే కాంగ్రెస్ పార్టీని భావి ప్రధాని అయిన ఇలాకాలో జెండా పాతాలనుకోవడం..నిజంగా విశేషమే.