ఏపీలో ఏనుగులకూ ఆధార్!
Published on: Thu May 7, 2026 12:16PM

ఆంధ్రప్రదేశ్ లో ఏనుగులకూ ఆధార్ తరహా గుర్తింపు కార్డులు జారీ కానున్నాయి. రాష్ట్ర అటవీ శాఖ ఏనుగులకూ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఏనుగుల సంరక్షణ కోసం ఏపీ అటవీశాఖ ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది. ఆధార్ తరహా కార్డుల జారీ ప్రక్రియ కోసం ఇప్పటికే.. అధికారులు కుంకీ ఏనుగులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు.
సేకరించిన నమూనాలను తదుపరి విశ్లేషణ కోసం డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్కు పంపించారు. అక్కడి నుంచి నివేదికలు వచ్చిన వెంటనే కార్డుల జారీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించనున్నారు. కార్డులు కేవలం గుర్తింపు కోసమే కాకుండా ఏనుగుల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషించనున్నాయని చెబుతున్నారు.


