TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కళ్యాణ్‌పై ముప్పేట దాడి.. కూటమిలో చిచ్చు రేపేందుకేనా?

Published on: Mon Jun 1, 2026 4:46PM

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని అటు సొంత సామాజికవర్గం, ఇటు రాజకీయ ప్రత్యర్థుల నుంచి ముప్పేట దాడి మొదలైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు సరికొత్త వివాదాలు చుట్టుముడుతున్నాయి. అటు తెలంగాణలో భూముల వ్యవహారాలు, ఇటు ఆంధ్రాలో కాపు సామాజికవర్గ నేతల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలు జనసేనానిని రాజకీయంగా ఇరకాటంలోకి నెడుతున్నాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై  సీనియర్ రాజకీయ విశ్లేషకుడు  భరద్వాజ తో  తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.   పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. 

ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పవన్ కళ్యాణ్ ఏం చేశారంటూ దాసరి రాము వంటి నేతలు టోన్ పెంచి విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ పవన్ ఓడిపోవడానికి ఆ సామాజికవర్గమే బాధ్యత వహించాలంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రత్యర్థులు ఆయుధంగా మలుచుకుంటున్నారు. జనసేన కేవలం ఒక కులానికి పరిమితమైన పార్టీ కాదని పవన్ స్పష్టం చేస్తున్నప్పటికీ, ఆయనను టార్గెట్ చేయడం ఆపడం లేదు.

మరోవైపు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి  కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు కూడా పవన్‌పై విమర్శల దాడిని ముమ్మరం చేశారు. వంగవీటి మోహన రంగా హత్యోదంతాన్ని మళ్లీ తెరపైకి తెస్తూ, ఆనాటి రాజకీయ పరిస్థితులను ప్రస్తుత కూటమితో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రంగా అభిమానులు, కాపు సామాజికవర్గం విస్తృతంగా ఉన్న ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ బలాన్ని తగ్గించడమే ఈ విమర్శల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అందుకే రంగా హత్యను తెరపైకి తీసుకువచ్చి.. ఆ హత్యకు కారకులతో పవన్ కల్యాణ్ ఇప్పుడు ఉన్నారంటూ విమర్శిస్తున్నారు.

ఈ వ్యూహాత్మక ఒత్తిడి ద్వారా పవన్ కళ్యాణ్ చేత ఏదైనా భావోద్వేగ ప్రకటన చేయించాలని ప్రత్యర్థులు భావిస్తున్నారు. ఆ ప్రకటన గనుక కూటమి ప్రభుత్వ ఐక్యతకు భంగం కలిగించేలా ఉంటే..  దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది శత్రు పక్షాల ప్లాన్. ఈ ముప్పేట దాడిని తిప్పికొట్టేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్యాడర్ మద్దతును కూడగడుతున్నారు. ఇందులో భాగంగానే రాజమండ్రి, విజయవాడ, మంగళగిరి పార్టీ కార్యాలయాల్లో వరుసగా కీలక సమావేశాలు నిర్వహించారు.

రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ ప్రెజర్‌ను పవన్ కళ్యాణ్ ఎంత నిగ్రహంతో, శాంతియుతంగా హ్యాండిల్ చేస్తారనేది అత్యంత కీలకంగా మారింది. ఆయన భావోద్వేగానికి లోనై కూటమికి ఇబ్బంది కలిగిస్తారా? లేక చాకచక్యంగా ఈ వ్యూహాల నుంచి బయటపడి తన రాజకీయ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా? అనేది వేచి చూడాలి.