TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

2027.. జగన్, కేసీఆర్ యాత్ర స్పెషల్ సంవత్సరం!?

Published on: Tue Jun 9, 2026 10:48AM

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.  ముందుగా వైసీపీ అధినేత జగన్ ప్లాన్ ఏమిటని చూస్తే..  ఆయన  2027వ సంవత్సరంలో తాను సరికొత్త చారిత్రాత్మక పాదయాత్రను ప్రారంభించబోతున్నట్లు ఆయన బహిరంగంగానే వెల్లడించారు. ఈ పాదయాత్రకు సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్‌ను రాబోయే కొద్ది నెలల్లోనే వైసిపి శ్రేణులు సిద్ధం చేయనున్నాయి. అయితే ఈసారి జగన్ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. 2027లో అడుగు ముందుకు వేస్తే, మళ్లీ 2029 అసెంబ్లీ ఎన్నికల ముగింపు వరకు ఆయన నిరంతరం ప్రజల మధ్యే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలో 2019 ఎన్నికలకు ముందు జగన్ చేసిన పాదయాత్ర ఏపీ రాజకీయ చరిత్రను తిరగరాసి ఆయనకు బంపర్ మెజారిటీని తెచ్చిపెట్టింది. ఇప్పుడు 2026 దాటి 2027 రాగానే అదే మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను పూర్తిగా తన వైపు తిప్పుకోవడానికి ఈ సుదీర్ఘ పాదయాత్రే ఏకైక మార్గమని ఆయన నమ్ముతున్నారు.

ఇక ఇప్పుడు బీఆర్ఎస్  అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు విషయానికి వస్తే.. ఆయన కూడా జగన్ రూట్ నే ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆయన కూడా ప్రజలతో మమేకం అవ్వడం ద్వారా మళ్లీ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అయితే జగన్ పాదయాత్ర ద్వారా ప్రజలలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటుంటే.. కేసీఆర్ బస్సు యాత్ర అంటున్నారు. అదోక్కటే తేడా మిగతాదంతా సేమ్ టూ సేమ్.  ఇద్దరూ ఒకే రకమైన వ్యూహంతో ముందుకు సాగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు తమ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికీ.. వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ పీఠాన్ని దక్కించుకోవడానికి 2027ను   కీలకంగా భావిస్తున్నారు.  

  2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ దాదాపు ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. అయితే ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ 2027 ప్రారంభం నుండి కేసీఆర్ సరికొత్త అవతారంలో ప్రజల ముందుకు రానున్నట్లు ఆ పార్టీ కీలక నేత తన్నీరు హరీష్ రావు అధికారికంగా స్పష్టం చేశారు. 2027 నుండి కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో అత్యంత చురుకైన పాత్ర పోషించబోతున్నారు. ఇందుకోసం ఆయన బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గాన్ని తాకుతూ సాగే ఈ బస్ యాత్ర ద్వారా ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గులాబీ బాస్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.  చూడాలి మరి ఏపీలో జగన్ పాదయాత్ర, తెలంగాణలో కేసీఆర్ బస్సు యాత్రలకు జన స్పందన ఎలా ఉంటుందో?