TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆపరేషన్ సేఫ్ స్కూల్... 558 షాపులపై పోలీసుల ఏకకాల దాడులు

Published on: Sat Apr 18, 2026 8:39PM

 

విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు పోలీసులు నగరం మొత్తం ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్‌, పొగాకు ముప్పును మూలంలోనే అరికట్టాలనే సంకల్పంతో హైదరాబాద్ పోలీసులు శనివారం నగరవ్యాప్తంగా “ఆపరేషన్ సేఫ్ స్కూల్” పేరిట భారీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. సుమారు 5 వేల మంది సిబ్బంది పాల్గొన్న ఈ ఆపరేషన్‌లో విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు విక్రయాలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. పొగాకు అలవాటు డ్రగ్స్‌ వైపు నడిపించే మొదటి మెట్టు అన్న అవగాహనతో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 

పాఠశాలలు, కళాశాలల సమీపంలో పొగాకు అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థులు క్రమంగా వ్యసనాల బారిన పడుతున్నారన్న ఆందోళన నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలకు దిగారు. పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్, స్పెషల్ టీమ్స్, హెచ్-న్యూ, లా అండ్ ఆర్డర్ సిబ్బంది కలిసి నగరంలోని 558 షాపుల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి విద్యాసంస్థల సమీపంలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.

సీపీ సజ్జనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతాలు చిరాగ్ అలీ లేన్,రెడ్ హిల్స్, మెహదీపట్నం, గోషా మహల్  వంటి ప్రాంతాల్లో విద్యాసంస్థల సమీపంలోని దుకాణాలను పరిశీలించారు.గోషామహల్ ఎంజే బ్రిడ్జి వద్ద మీడియాతో మాట్లాడుతూ, మైనర్లకు పొగాకు అమ్మే వారిపై “ఉక్కుపాదం” మోపుతామని హెచ్చరించారు. డెకాయ్ ఆపరేషన్‌లో చిన్నారులకు పొగాకు విక్రయిస్తున్నట్లు ఆధారాలతో బయటపడిన దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా హెచ్-న్యూ విభాగంలో ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు సీపీ ప్రకటించారు. విద్యాసంస్థల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ పోరాటం కేవలం పోలీసులదే కాదని, తల్లిదండ్రులు మరియు విద్యాసంస్థలు కలిసి బాధ్యత తీసుకోవాలని కోరారు. పిల్లల ప్రవర్తన, స్నేహితులు, స్కూల్ తర్వాత కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యాసంస్థల సమీపంలో ఎవరైనా చట్టవిరుద్ధంగా పొగాకు విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 లేదా 8712661601కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు.