TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ 90వ రోజు ప్రజాదర్బార్

Published on: Tue Jun 16, 2026 2:27PM

 

 మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 90వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులు, సమస్యలను స్వీకరించి సంబంధిత అంశాలపై స్పందించారు. పల్నాడు జిల్లాకు అత్యంత కీలకమైన వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వరికపూడిశెల జలసాధన సమితి ప్రతినిధులు మంత్రి లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

బుద్ధ యోగా ఫౌండేషన్ ద్వారా మోసపోయిన 1,056 మంది యోగా ఇన్‌స్ట్రక్టర్లకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. గత మూడేళ్లుగా తాము అందించిన సేవలను గుర్తించి తగిన గుర్తింపు కల్పించడంతో పాటు, భవిష్యత్తులో కూడా ఈ సేవలను ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన గోల్డ్ లోన్ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. తాము తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల విషయంలో తూకం, వస్తువుల పరంగా తేడాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో పేద గర్భిణీల ఆరోగ్య సంరక్షణ కోసం నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టాలని, మహిళల భద్రత కోసం ప్రతి నియోజకవర్గంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు మంత్రి లోకేష్‌ను కోరారు.ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలెం పంచాయతీ సమగ్ర అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని గ్రామానికి చెందిన ఎన్. మల్లికార్జున నాయుడు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో రోడ్ల నిర్మాణంతో పాటు గండివాగుపై వంతెన నిర్మించాలని కోరారు.ప్రజల నుంచి అందిన అన్ని వినతులను పరిశీలించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.