స్పీకర్ కోడెలపై దాడి.. 8 మంది అరెస్ట్

 

ఏపీలో ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ఎన్నికల రోజు టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. కొందరైతే ఏకంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పైనే దాడి చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించి తాజాగా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనుమట్ల గ్రామంలో పోలింగ్‌ రోజున కోడెలపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో నిందితులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఆ గ్రామానికి  భారీగా పోలీసులు చేరుకున్నారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి.. 8 మందిని అదుపులోకి తీసుకోగా.. మొత్తం 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడిలో మహిళలలు కూడా పాల్గొన్నారని సమాచారం. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. సుమారు వందమంది పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఈ దాడిలో నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని పోలీసులు కోరుతున్నారు.