విజయవాడ కోవిడ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి

విజయవాడలోని హోటల్ స్వర్ణా ప్యాలెస్ లో రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం నిర్వహిస్తున్న కోవిడ్‌-19 చికిత్సా కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఏడుగురు మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

 

రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో పెయిడ్ క్వారం టైన్ నడుస్తోందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 50 మంది కరోనా బాధితులు స్వర్ణ ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరగగా.. తొలుత గ్రౌండ్ ఫ్లోర్ లో అంటుకున్న మంటలు, తర్వాత పై అంతస్తులకు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అంబులెన్స్‌లలో రోగులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. భయంతో కొందరు భవనం పైనుంచి దూకగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.