TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొత్తగా 62 అన్న క్యాంటీన్ల...ఈనెల 15న సీఎం చంద్రబాబు శ్రీకారం

Published on: Mon Apr 13, 2026 6:52PM

 

కార్మికులు, కూలీలు, గ్రామీణులు వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సంకల్పంతో 207 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వం... తాజాగా మరికొన్ని అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకొస్తోంది. రూ.5లకే పేదలకు కడుపునిండా నాణ్యమైన భోజనాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ సేవలను గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తామని చెప్పిన సర్కార్... ఆ హామీని ఆచరణలో పెడుతోంది. 

మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లను కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయగా 3 క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 62 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో  ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రెండవ విడత అన్నక్యాంటీన్లను ఈ నెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు పెదకూరపాడు నియోజకవర్గం, ధరణికోటలో ప్రారంభిస్తారు

రూ.5లతో రుచిగా... శుచిగా ఆహారం

గత ప్రభుత్వం కక్షగట్టి మూసివేసిన అన్నక్యాంటీన్లను కూటమి అధికారంలోకి వచ్చాక పున: ప్రారంభించింది. ఈనెల 15వ తేదీన ప్రారంభించబోయే 62 క్యాంటీన్లతో ఈ సంఖ్య 269 కు పెరుగనుంది. రుచి, శుచితో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని పేదలకు ప్రభుత్వం అందిస్తోంది. క్యాంటీన్ల పున:ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా పేదలు 8.80 కోట్ల భోజనాలు చేశారు. 

ఒక్కో అన్న క్యాంటీన్‌లో సగటున రోజుకు 1,013 మంది చేసే భోజనాలకు  రూ.26,250 ఖర్చు అవుతోంది. 207 అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు 2.10 లక్షల మంది భోజనాలు చేస్తున్నారు. ఇందుకు రోజుకు రూ.54 లక్షలకు పైగా వ్యయం అవుతుండగా... సబ్సిడీ కోసం ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.243 కోట్లు వెచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసే గ్రామీణ అన్న కాంటీన్ల సబ్సీడీకి ఏడాదికి రూ.58 కోట్లు వ్యయం అవ్వనుంది.