ఏపీ లో 44 మంది క్వారంటైన్కు తరలింపు
posted on Mar 26, 2020 8:00PM
విదేశాల నుంచి వచ్చిన వారిని ముమ్మరంగా స్క్రీనింగ్
డేంజర్ జోన్ గా విజయవాడ గాయత్రీ నగర్
కరోనా వైరస్పై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు. కాగా ఇప్పటివరకూ ఏపీలో 10 కేసులు పాజిటివ్గా నిర్థారణ కాగా, 289 కేసులు నెగటివ్గా వచ్చినట్లు చెప్పారు. మరో 33 కేసుల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా విదేశాల నుంచి వచ్చిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా స్క్రీనింగ్ చేస్తోంది. ఇప్పటివరకూ 26,059 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని వాలంటీర్లు గుర్తించారు. మరోవైపు 25,942 మందిని హోం ఐసోలేషన్లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే 117మందిని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకూ 332 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా, 289 కేసులు నెగటివ్గా, 10 కేసులు పాజిటివ్గా నిర్థారణ అయ్యాయి. మరో 33 కేసుల ఫలితాల కోసం వైద్యులు ఎదురు చూస్తున్నారు. ఇక పలు జిల్లాల్లో నిత్యావసరాలను రాష్ట్ర ప్రభుత్వం డోర్ డెలివరీకి ఏర్పాట్లు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో ఫోన్ కాల్ చేస్తే ఇంటికే సరుకులు అందేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్, నాకా బందీకి సీఎస్, డీజీపీలు ఆదేశాలు ఇచ్చారు. అన్ని రహదారులను బ్లాక్ చేసి, పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణ నుంచి వచ్చి 44 మందిని క్వారంటైన్కు తరలించి, వైద్యం అందిస్తున్నారు. ఇక ప్రజల సందేహాలు తీర్చేందుకు 24 గంటల కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అలాగే ఇరవై నాలుగు గంటలు పని చేసేలా నాలుగు టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా, విజయవాడ గాయత్రి నగర్ లో అపార్ట్మెంట్ లో నివసించే వారిని గ్రామ వాలంటీర్లు పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. అపార్ట్మెంట్ వారు అనుమతించకపోతే పోలీసువారి సహకారం తో పరిశీలించవచ్చునాని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇక్కడ అపార్ట్మెంట్ లో చాలా మంది విదేశాల్లో నివసించి ఈ పది రోజుల్లో వచ్చి వుంటారని సమాచారం.