బెంగాల్ లో ఉద్రిక్తత.. ఇద్దరు మృతి

 

బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల ఘర్షణలతో ఇటీవల రణరంగంగా మారిన పశ్చిమబెంగాల్‌లో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కోల్‌కతా సమీపంలోని భట్‌పరా ప్రాంతంలో గురువారం ఉదయం రెండు వర్గాలకు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

భట్‌పరా ప్రాంతంలో ఈ ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం తుపాకులతో కాల్పులు జరిపారు. నాటు బాంబులు విసురుకున్నారు. ఈ ఘటనలో రాంబాబు షా అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

తాజా ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం మమతాబెనర్జీ ఆదేశాల మేరకు డీజీపీ, చీఫ్‌ సెక్రటరీ, ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు.