TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ డిజిటల్ బుక్.. తొలి ఫిర్యాదు మాజీ మంత్రి విడదల రజినిపైనే

Published on: Mon Sep 29, 2025 2:43PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆర్భాటంగా డిజిటల్ బుక్ యాప్ ను ప్రారంభించారు. ఈ బుక్ లో వైసీపీ కార్యకర్తలు తమను వేధించిన వారిపై ఫిర్యాదులు నమోదు చేస్తే.. తాను అధికారంలోకి వచ్చాకా, వారి సంగతి తెలుస్తానని అన్నారు. చాలా మంది ఈ డిజిటల్ బుక్ ను గత ఎన్నికల సమయంలో లోకేష్ చెప్పిన రెడ్ బుక్ కు మక్కీకి మక్కీ కాపీ అన్న విమర్శలు వెల్లువెత్తాయి. అది పక్కన పెడితే జగన్ ప్రారంభించిన ఈ డిజిటల్ బుక్ బమూరాంగైందన్న సెటైర్లు సొంత పార్టీ వారి నుంచే వినిపిస్తున్నాయి. జగన్ హయాంలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలపై వేధింపులు పరాకాష్టకు చేరాయి. ఇప్పుడు వేధింపులపై ఫిర్యాదులు నమోదు చేయండి అంటూ.. జగన్ డిజిటల్ బుక్ ను ఇలా ప్రారంభించారో లేదో.. అలా  ఆ డిజిటల్ బుక్ లో తొలి ఫిర్యాదు నమోదైంది. ఇంతకీ ఆ ఫిర్యాదు ఎవరిపైనో తెలుసా? వైసీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినిపై. ఔను డిజిటల్ బుక్ లో నమోదైన తొలి ఫిర్యాదు విడదల రజినీ పైనే.. 

జగన్ హయాంలో విడదల రజినిపై పలు ఆరోపణలు ఉన్నాయి. వేధింపులు, దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు ఇలా లెక్కలేనన్ని ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. కేసులు కూడా నమోదయ్యాయి. అవన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు జగన్ డిజిటల్ బుక్ లో తొలి ఫిర్యాదు విడదల రజినీపైనే రావడంతో జగన్ డిజిటల్ బుక్ సొంత పార్టీ వారిపై వచ్చిన ఆరోపణలపై ఏం చర్యలు తీసుకుంటుదా అన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తం అవుతున్నది. ఇంతకీ రజినిపై ఫిర్యాదు ఏమిటంటే.. 

చిలుకలూరిపేటలో ఎన్నో అరాచకాలు చేసిన విడుదల రజనీ టీడీపీ వారినే కాదు.. సొంత పార్టీకి అండగా ఉండే వారిని కూడా టార్గెట్ చేశారు. నవతరం  అనే పార్టీకి స్వయం ప్రకటిత అధ్యక్షుడైన   రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి రజనీపై డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు. 2022లో  రజినీ మంత్రిగా ఉన్న సమయంలో  తన కార్యాలయం, నివాసంపై దాడులు చేయించారన్నది ఆ ఫిర్యాదు సారాంశం. ఈ దాడికి సంబంధించిన ఆధారాలను కూడా ఆయన  ఆ ఫిర్యాదుకు జోడించారు.  విడదల రజినిపై చర్యలు తీసుకుంటేనే వైసీపీ కార్యకర్తలు జగన్ ను నమ్మతతారనీ, లేకపోతే కార్యకర్తలలో జగన్ విశ్వాసాన్ని కోల్పోతారని ఆ సుబ్రహ్మణ్యం అంటున్నారు. 

వాస్తవానికి చిలుకలూరిపేట  ఎమ్మెల్యేగా విడదల రజిని ఉన్న సమయంలోనూ, అలాగే ఆ తరువాత జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న సమయంలోనూ  రజినిపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయి. పలు కేసులు కూడా నమోదయ్యాయి. అంతెందుకు ఆమె మరిదిని పోలీసలు అరెస్టు చేశారు కూడా.  అధికారంలో ఉన్నప్పుడు ఆమె సొంత పార్టీ వారిపై కూడా దౌర్జన్యాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ డిజిటల్ బుక్ లో రజినిపైనే తొలి ఫిర్యాదు నమోదు కావడంతో.. ముందు ముందు వైసీపీ నేతలపైన డిజిటల్ బుక్ లో మరెన్ని ఫిర్యాదులు నమోదౌతాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సొంత పార్టీ నుంచి సైతం ఆమెపై ఫిర్యాదులు తప్పడం లేదు. ఆమె చేసిన దందాల కారణంగా పేటలో అయితే గెలలేరని గుంటూరుకు పంపించారు. అక్కడ అసలు ఘోరంగా ఓడిపోవడంతో..తనకు పేటనే మంచిదని చెప్పి మళ్లీ అక్కడికే ఇంచార్జ్ గా వెళ్లి రాజకీయాలు చేస్తున్నారు.