వైసీపీ నేత తోటలో భారీగా మద్యం స్వాధీనం

 

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కొందరు నాయకులు రకరకాల దారులు ఎన్నుకుంటారు. వాటిల్లో డబ్బు, మద్యం ముందు వరుసలో ఉంటాయి. ఎన్నికల నేపథ్యంలో ఏపీలో కొందరు నేతలు అదే చేస్తున్నారు. చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధి కుంభార్లపల్లె వద్ద మామిడితోటలో శుక్రవారం రాత్రి పోలీసులు 170 మద్యం కేసులను పట్టుకున్నారు. వైసీపీకి చెందిన శ్రీరాములురెడ్డి మామిడితోటలో మద్యం దాచారని పోలీసులకు శుక్రవారం రాత్రి సమాచారం అందింది. దీంతో అక్కడికి వచ్చి గాలించగా 170 మద్యం కేసుల్లో దాదాపు 8,160 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో పంపిణీకి వీటిని ఇక్కడ నిల్వ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీటి విలువ రూ.6 లక్షలు ఉంటుందని సీఐ పేర్కొన్నారు. మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని తోట యజమాని శ్రీరాములురెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.