ఘోర రోడ్డు ప్రమాదం.. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్.. 

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగర సమీపంలో ఈ తెల్లవారు ఝామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న వారిపైకి ట్రక్కు దూసుకెళ్లిన దుర్ఘటనలో 15 మంది మరణించారు. సూరత్ నగర సమీపంలోని కిమ్ చార్ రాస్తా వద్ద ఫుట్ పాత్ పై 18 మంది వలస కూలీలు నిద్రిస్తున్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గత అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో కోసంబిలోని ఓ చౌరస్తా నుంచి మాండివైపు లారీ వేగంగా దూసుకు పోతోంది. అదే సమయంలో ఎదురుగా చెరకు లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను ఆ లారీ ఢీకొట్టింది. దీంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్ పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌ పైకి లారీని మళ్లించాడు. దీంతో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న 15 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతులంతా రాజస్థాన్‌లోని బాన్స్‌వాడాకు చెందిన కూలీలని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘోర ప్రమాదం నుంచి 9 నెలల చిన్నారి సురక్షితంగా బయటపడినప్పటికీ ఆమె తల్లిదండ్రులు మాత్రం మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.