మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది కూలీలు దుర్మరణం
Published on: Thu Apr 30, 2026 9:24AM

మధ్యప్రదేశ్ లో బుధవారం (ఏప్రిల్ 29) రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది కూలీలు మృత్యువాత పడ్డారు. ధార్ జిల్లాలో ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఒక పికప్ వ్యాన్ ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్న పేద కూలీలే.
కూలీలతో కిక్కిరిసి ఉన్న ఒక పికప్ వ్యాన్ ఎదురు దిశలో వస్తున్న ఒక ప్రైవేట్ కారును అతివేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలూ నుజ్జునుజ్జయ్యాయి. వ్యాన్ బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పికప్ వ్యాన్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.


