కొవిడ్ కట్టడి ఇలా.. ప్రధానికి విపక్షాల ఉమ్మడి లేఖ

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోడీకి పన్నెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా లేఖ రాశాయి. కరోనా కట్టడికి సంబంధించి పలు సూచనలు చేశాయి. మహమ్మారి నేపథ్యంలో నెలకొన్న సంక్షోభాన్ని మానవ విషాదంగా పేర్కొన్న పార్టీలు.. ఉచిత వ్యాక్సిన్లు, సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు నిలిపివేత వంటి పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాయి.  గతంలోనే పలు పార్టీలు చేసిన విన్నపాల్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించాయి. ఈ వైఖరే మానవ విషాదానికి దారి తీసిందని వ్యాఖ్యానించాయి.

అందుబాటులో ఉన్న అన్ని వనరుల నుంచి వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని విపక్షాలు సూచించాయి. వెంటనే ఉచిత, సార్వత్రిక వ్యాక్సినేషన్‌ క్యాంపెయిన్‌ను నిర్వహించాలని కోరాయి. టీకా ఉత్పత్తిని పెంచేందుకు తప్పనిసరి లైసెన్సింగ్‌ విధానాన్ని తీసుకురావాలని ప్రధానికి సూచించాయి. వ్యాక్సిన్ల కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ.35 వేల కోట్లను వెంటనే ఖర్చు చేయాలన్నాయి 12 విపక్ష పార్టీలు.

సెంట్రల్‌ విస్టా నిర్మాణాన్ని నిలిపివేసి ఆ నిధులను ఆక్సిజన్‌, వ్యాక్సిన్ల కోసం ఉపయోగించాలని సూచించాయి. పీఎం కేర్స్‌ నిధులను వ్యాక్సిన్లు, ఆక్సిజన్‌, వైద్య సామగ్రి కొనుగోలు చేసేందుకు కేటాయించాలని కోరాయి. నిరుద్యోగులకు నెలకు రూ.6000 చొప్పున అందించాలని డిమాండ్ చేశాయి. అర్హులకు ఉచితంగా ఆహారధాన్యాలు పంపిణీ చేయాలని.. సాగు చట్టాల్ని రద్దు చేసి ఆందోళన చేస్తున్న రైతుల్ని కొవిడ్‌ నుంచి రక్షించాలని విపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో సూచించాయి.